కోల్బెల్ట్, వెలుగు : సింగరేణిలో పనిచేస్తున్న ఆఫీసర్లకు రావాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపునకు కృషి చేస్తానని సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధప్రకాశ్ హామీ ఇచ్చారు. మంగళవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో డైరెక్టర్లు సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, తిరుమల్రావు, కోల్మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇండియా సింగరేణి బ్రాంచీల సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆఫీసర్లు గతంలో సింగరేణి యాజమాన్యానికి ఇచ్చిన నోటీసులోని అంశాలపై చర్చించారు. ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి సీఎండీ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆఫీసర్ల పే అప్గ్రెడేషన్ గురించి స్టడీ చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసి త్వరలో కోలిండియాకు పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. పీఆర్పీ బకాయిల చెల్లింపు విషయంపై సీఎం ఆఫీస్ సెక్రటరీని కలిసి సమస్యను పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన ఇతర సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే స్ట్రక్చర్డ్ మీటింగ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు.
తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం సీఎండీ సానుకూలంగా స్పందించడం పట్ల సీఎంవోఏఐ కార్యవర్గం హర్షం ప్రకటించింది. సమావేశంలో సీఎంవోఏఐ సింగరేణి బ్రాంచ్ ప్రెసిడెంట్ టి.లక్ష్మీపతిగౌడ్, జనరల్ సెక్రటరీ పెద్ది నరసింహులు, జాయింట్ సెక్రటరీ రాజగోపాల్, ట్రెజరర్ నరేశ్, అన్ని ఏరియాల బాధ్యులు కోల శ్రీనివాస్, నజీర్, మధునాయక్, శివ, పంతుల, కేవీ.రెడ్డి, రమేశ్, మురళి పాల్గొన్నారు.
